Search This Blog

Chodavaramnet Followers

Tuesday 4 November 2014

TELUGU PURANA STORIES COLLECTION - THE GREAT SAGE VASISTHA MAHARISHI


వశిష్ట మహర్షి 
వశిష్ట మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి.మహాతపస్సంపన్నుఁడు. సప్త ఋషులలో వశిష్ట మహర్షి కూడా ఒకడు. బ్రహ్మ యొక్క మానస పుతృడు. బ్రహ్మ యొక్క సంకల్ప బలంచేత జన్మించాడు.[1] సూర్యవంశానికి రాజపురోహితుడు. వైవస్వతమన్వంతరమున సప్తర్షులలో ఒకఁడు. ఇంద్రుడు వశిష్ట మహర్షి యొక్క యజ్ఙాలకు మెచ్చి కామధేనువు పుత్రిక అయిన నందిని అనే గోవుని ఇస్తాడు. ఇది కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు. అందరు మహర్షులలాగా ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత మరియు పతిభక్తి పరాయణురాలైన అరుంధతితో వివాహమైంది. వీరికి 100 మంది కుమారులు కలిగెను. వారిలో శక్తి జేష్టుడు. ఈతని భార్య అద్రుశ్యంతి. శక్తి పుత్రుడే పరాశరుడు.

ఇంకను వశిష్ఠుడు కుమారులుగా చిత్రకేతువు, పురోచిషుడు, విరచుడు, మిత్రుడు, వుల్భకుడు, వసుబృద్ధాకుడు మరియు ద్యుమన్తుడు అని ప్రసిద్ద గ్రంధముల వలన తెలియు చున్నది.

ఈతఁడు దక్షప్రజాపతి కూఁతురు అగు ఊర్జను వివాహమయి ఆపెయందు రజుఁడు, గోత్రుఁడు, ఊర్ధ్వబాహువు, సవనుఁడు, అనఘుఁడు, సుతపుఁడు, శుక్రుఁడు అని ఏడుగురు పుత్రులను పొందెను. వారు స్వాయంభువ మన్వంతరమున సప్తర్షులుగ ఉండిరి. ఇతఁడు తొలుత బ్రహ్మమానసపుత్రుఁడు అయి ఉండి నిమి శాపముచేత ఆశరీరమునకు నాశము కలుగఁగా మిత్రావరుణులకు మరల జన్మించెను. ఒకప్పుడు మిత్రావరుణులకు ఊర్వసిని చూచి రేతస్సు స్ఖలితము అయి అది ఒక కుంభమునందు చేర్పఁబడఁగా అందుండి వసిష్ఠుఁడును, అగస్త్యుఁడును పుట్టిరి. కనుక వీరు ఇరువురును కుంభజులు అనఁబడుదురు.

సరస్వతీ నదీ తీరాన వశిష్ట మహర్షి ఆశ్రమం ఉండేది. ఇక్కడ దాదాపు పదివేల మంది శిష్యులకి విధ్యాభ్యాసంతో పాటుగా భోజనం కూడా పెట్టేవాడు. అందువల్ల కులపతి అని పేరు వచ్చింది.