Search This Blog

Chodavaramnet Followers

Friday 27 January 2017

INFORMATION ABOUT Telangana Saleshwaram Temple – Famous Cave Temple - Saleshwaram Temple, Lingamaiah Temple at a cave in Nallamala


సాహసం.. సౌందర్యం.. సలేశ్వరం

చుట్టూ విశాలమైన అడవి.. ఎత్తైన చెట్లు.. పకతి అందాలు... పక్షుల కిలకిలలారావాలు... పాముల పుట్టలు... వన్యప్రాణులు.. దట్టమైన నల్లమల అడవిలోని ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం మరిచిపోయి ఇక్కడ కొలువైనాడు! పున్నమి రాత్రి నట్టడవిలో వస్తున్నాం.. వస్తున్నాం.. జంగమయ్యా అంటూ సాగే యాత్ర ఓ మధురానుభూతి ! ఇక్కడి రాయి, రప్ప, చెట్టు, పుట్ట ప్రతిదీ ఆధ్యాత్మికతను అలుముకుని ఉంటాయి. లోతైన లోయలో కొలువుదీరిన లింగమయ్యను చేరుకోవడానికి కాలినడకన ఆరు కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే! నడవటం కష్టంగా అనిపించే దారిలో సాగే

ఆ యాత్ర నిజంగా ఓ సాహసం.. సౌందర్యం !

* ఆ ఆద్భుత స్థలమే సలేశ్వరం...

సామాన్యులు సలేశ్వరమని పిలుచుకునే సర్వేశ్వర క్షేత్రం మహాబూబ్‌నగర్ జిల్లా నల్లమల అడవిలో ఉంది.

మన్ననూరుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో... దట్టమైన అడవిలోని ఒక లోతైన లోయలో ఉంది. ప్రతీ సంవత్సరం చైత్ర పున్నమినాడు ఈ క్షేత్రానికి భక్తులు వేలసంఖ్యలో తరలివస్తారు. సాహసం చేయాలనే అభిలాష ఉన్నవారికి ఈ క్షేత్రదర్శనం మంచి అనుభూతిని కలిస్తుందనడంలో సందేహం లేదు. పున్నమి నాటి రాత్రి అడవిలో వేలాది భక్తులు లోయలోకి దిగి స్వామిని దర్శించుకుంటారు. ఈ శివాలయం ఎదరుగా దాదాపు మూడువందల అడుగుల ఎత్తు రాతికొండ నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

పచ్చని చెట్ల మధ్య, చల్లటి వాతావరణంలో ప్రకతి అందాలు తిలకిస్తూ జరిపే సలేశ్వర యాత్రకు ఏటేటా భక్తులు, యాత్రికుల సంఖ్య పెరుగుతూవస్తున్నది. అచ్చంపేట, కల్వకుర్తి ఆర్టీసీ డిపోలు ఈ యాత్ర సందర్భంగా స్పెషల్ బస్సులు నడుపుతాయి. మన్ననూరు నుంచి శ్రీశైలం ప్రధాన రహదారిలో సుమారు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడి వరకు వాహనాలు వెళతాయి. వాహనాలు ఆగిన స్థలం నుంచి క్షేత్రం సుమారు ఆరుకిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందులో నాలుగు కిలోమీటర్లు లోయలోకి దిగాలి. ఒకే ఒక మనిషి నడిచేంత బాటతో కూడిన లోయ అడుగుభాగానికి చేరుకోవడం నిజంగా సాహసమే!

* అదంతా స్వామి మహిమే

చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా ప్రతీఒక్కరూ జంగమయ్య సేవలో తరించిపోతారు. కర్రనే ఊతంగా చేసుకుని పండు ముదుసలివారు జంగమయ్య దర్శనం కోసం బారులు తీరడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ యాత్రలో ఇప్పటికీ ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. దీన్ని స్వామి మహిమగా కొందరు చెప్తుంటారు. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాల నుంచి కూడా ఈ క్షేత్రానికి భక్తులు వస్తుంటారు. ఈ క్షేత్రం గుర్తించి శ్రీపర్వత పురాణంలో పేర్కొన్నారు. పూర్వం ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే రవాణ సౌకర్యాలు లేక 40,50 కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ వెళ్లాల్సివచ్చేది.

ఈ అడవిలో క్రూరమగాల సంఖ్య కూడా ఎక్కువే. వాటి బారినపడకుండా ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి జంతువులను పారదోలడానికి అందరూ ఒక్కసారిగా దేవుడిని స్మరిస్తూ గట్టిగా అరిచేవారట. ప్రస్తుతం రవాణా సౌకర్యాలు మెరుగుపడి, అడవి పలుచబడి, జనసంచారం పెరిగి ప్రమాదాల ఆస్కారం తగ్గినా పాత అలవాటు ప్రకారం దైవనామస్మరణ చేస్తూ కొండ ఎక్కడం, దిగడం ఆచారంగా మారిపోయింది. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి మూడుదారులున్నాయి. మన్ననూరు నుంచి, కొండనాగుల నుంచి, లింగాల నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. అయితే కొండనాగుల, లింగాల గ్రామాల నుంచి అటవీ మార్గం ద్వారా సుమారు 40 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. అయినా ఈ దారి గుండా వందలాది భక్తులు ఈ క్షేత్రానికి వస్తూంటారు. నల్లమల అడవిలో మొత్తం ఐదు పంచలింగాలున్నాయి.

శ్రీశైల మల్లికార్జునస్వామి (జ్యోతిర్లింగం), సలేశ్వరంలింగమయ్యస్వామి, లొద్దిమల్లన్న, ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికీ తెలిసినవి. తెలియని ఐదో లింగాన్ని దర్శించుకుంటే పునర్జనమ్మ ఉండదని కొందరు భక్తులు అంటారు. ఆ ఐదో లింగం నల్లమల అడవిలో ఎక్కడుందో ఇప్పటికీ రహస్యమే! నల్లమలలో ఉన్న పలు క్షేత్రాలపై ఆయా ప్రాంతాల్లో నివసించే చెంచులకే అధికారముంది. ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం కూడా ముందు చెంచుల ఆధీనంలోనే ఉండేది. ఆ తర్వాత దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చింది. ప్రతీ సంవత్సరం చైత్ర పున్నమినాడు జరిగే సలేశ్వర ఉత్సవం మాత్రం మొత్తం చెంచుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ ఉత్సవం సందర్భంగా ఆదాయం కూడా బాగానే వస్తుంది. ఏర్పాట్లూ అంతే గొప్పగా ఉంటాయి మరి! దట్టమైన అడవిలో లోతైన లోయలో ఉన్న ఈ క్షేత్రం దగ్గరకు చెంచులు జనరేట్ ద్వారా కరెంటును ఏర్పాటుచేయడం ముచ్చటేస్తుంది.

* అల్లుడు శ్రీశైలం మల్లన్న

తరతరాల నుంచి చెంచులు నల్లమలల అడవుల్లో ఒకటై బతుకుతున్నారు. పూర్వకాలంలో చెంచులను రావగాళ్లు అనేవారు. ఇప్పుడు దేవ చెంచులు, అడవి చెంచులు అని పిలుస్తున్నారు. శ్రీశైలం మల్లన్న, నరసింహస్వామి చెంచుల అల్లుళ్లు. భ్రమరాంబ, చెంచులక్ష్మి వారి ఆడపడుచులు. నల్లమలలోని దేవాలయాల నిర్వహణలో వారి బాధ్యతను అందరూ గౌరవిస్తారు.

* శివుడు అవతరించిన వేళ..

చెంచు పెద్దమనిషి రావగాడు. మిట్టమధ్యాహ్నం ఎండల్లో కుక్కలను వేసుకొని వేటకు వెళ్లాడు. ఎక్కడా చుక్కనీరు దొరకలేదు. కుక్క నీటి జాడనుపట్టి మెట్లు దిగి చుక్కలు చుక్కలుగా పడే నీటి ధార ఉన్న పాపనాశనం దగ్గరకు తీసుకెళ్లింది. రావగాడు నీళ్లుతాగుతుండగా లింగమయ్య స్వామి ఒక చెంచువాడిలాగా కత్తి, దబ్బ, అంబులు, నాభిలో పిడిబాకుతో బంగారు విగ్రహంలాగా మెరిసిపోతూ దర్శమిచ్చాడు. ఆ రాత్రి లింగమయ్య రావగాడి కలలోకోచ్చి నేను నీ ఇలవేల్పు లింగమయ్యను. నన్ను నిలపుకోండి...! నా కోసం గుడికట్టండి అని ఆదేశించాడు...! తమకు కనిపించని లింగమయ్య చెంచుపెద్దమనిషికి కనిపించినందుకు అక్కడ మునులు ఆశ్చర్యపడి గుడికట్టడంలో అతనికి సహకరించారట.

* గంగమ్మ పంతం

భ్రమరాంబ, గంగమ్మ శివుణ్ణి వెతుక్కుంటూ వస్తారు. ఇంటికి పోదాం రమ్మంటారు. చెంచులను వదిలి రానంటాడు శివుడు. భ్రమరాంబ శివుడితో కలిసి బౌరం చెరువు దగ్గర నిలుస్తుంది. కానీ గంగమ్మ మాత్రం నీవు ఎట్లా రావో చూస్తానంటూ పంతంతో ఆనకట్టలాంటిది కట్టి లింగమయ్యను నీళ్లలో ముంచడానికి ప్రయత్నిస్తది. గుడి పూర్తిగా మునిగేలాగా నీరు పెరుగుతుంది. అప్పుడు లింగమయ్య కోపగించి చేతిలో శంఖాన్ని కట్టకేసి కొడతాడు. ఆ శంఖం రెండు గుండాలను తొలుస్తుంది. నీరు ఇంకిపోతుంది. లింగమయ్య కింద గుడి వదిలి పైకివస్తాడు. గంగ ఎక్కడికీ పోకుండా లింగమయ్య సన్నిధిలోనే ఉంటుంది. ఈ సంఘటన జరిగిన కొత్త సంవత్సరం పున్నమిరోజు చెంచులు గొప్పగా పండుగ చేసుకున్నారు. ఈ పున్నమి రోజు ఈ చుట్టుపక్కల జలాలు ఉప్పొంగుతాయి.

* సర్వరోగ నివారిణి ఆ జలం

గుడిలోని శంఖుతీర్థంలో స్నానాన్ని పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఎన్నో వనమూలికల మీదుగా పారే గుండంజలం సర్వరోగనివారిణి. గుడిలో ప్రతి ఆకును పసుపు, కుంకుమ కొబ్బరికాయ, చక్కెరతో పూజిస్తారు. లింగమయ్యస్వామికి, గంగమ్మకు భక్తులు వెండి వస్తువులను చేయించి మొక్కులు చెల్లించుకుంటారు. నాగదోశం ఉన్నవారు వెండినాగుపామును ఇస్తుంటారు. చెంచులు లింగమయ్యకు కొత్తగా పూసిన ఇప్పపువ్వును సారాయి నైవేద్యమిస్తారు. మెట్ల దగ్గర మైసమ్మ దేవర కాపలా ఉంటుంది. కాబట్టి చెప్పులతో దిగరాదు. మైల దోషం ఉన్నవారు మెట్టు దాటి వెళ్లరాదు. అలాగే గుడి ఎదుట జలపాతానికి అడ్డుపడి స్నానాలు చేస్తూ గంగమ్మ, లింగమయ్యకు మధ్యకి వచ్చి వారు ఆగ్రహానికి గురి కారాదు.