Search This Blog

Chodavaramnet Followers

Friday 14 August 2015

TELUGU MAHABHARATHA KATHALU - BARBARIKUDU


బర్బరీకుడు 

బర్బరీకుడి కథ భారతీయ సనాతన సంప్రదాయంలోని పురాణ, ఇతిహాసాల్లో కొద్దిసేపు తలుక్కున మెరిసి మాయమైనా, చదవగానే చాలాసేపు ఆలోచింప జేసేంత అద్భుతమైనది. స్కందపురాణం ప్రకారం బర్బరీకుడు ఘటోత్కచుడికి ముర అనే ప్రాగ్జోతిషపుర రాక్షసరాజు కూతురైన మౌర్వికి పుట్టినవాడు. అతనికి ఉంగరాల జుట్టు ఉండడం మూలంగా బర్బరీకుడనే పేరు వచ్చింది. ఇతని బాల్యమంతా తల్లి వద్దే గడిచింది. శస్త్రాస్త్ర విద్యలన్నీ తల్లి వద్దే నేర్చుకున్నాడు.
బర్బరీకుడు చాలా బలవంతుడు, ధైర్యవంతుడు. శివుని మెప్పించి అమోఘమైన తిరుగులేని మూడు బాణాలను సంపాదించాడు. అవి క్షణంలో ముల్లోకాలను మట్టు బెట్టగల మహత్తరమైన అస్త్రాలు. మొదటి బాణం వదిలితే ఎవరిని చంపాలో అందరినీ గుర్తు పెడుతుంది. రెండోబాణం ఎవరినైనా కాపాడాలంటే వారిని గుర్తు పెట్టడానికి ఉపయోగ పడుతుంది. మూడోబాణం గుర్తుపెట్టిన వారిని మినహాయించి మిగతా వారిని నాశనం చేస్తుంది.
పాండవులకు, కౌరవులకు కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతున్నదని తెలిసి బర్బరీకుడు యుద్ధభూమికి వెళ్ళడానికి తల్లి అనుమతి కోరతాడు. తల్లి అందుకు అనుమతిస్తూ, యుద్ధంలో బలహీనమైన పక్షం తరుపున యుద్ధం చేయమని ఆదేశిస్తుంది. (బహుశా పాండవులది బలహీన పక్షమని ఆమె ఉద్దేశ్యం కాబోలు. కురుక్షేత్రంలో పాండవుల సైన్యం ఏడు అక్షౌహిణిలు అయితే కౌరవులది పదకొండు అక్షౌహిణిలు). బర్బరీకుడు అలాగే అంటూ తల్లికి వాగ్దానం చేసి యుద్ధానికి బయలు దేరుతాడు.
మహాభారత యుద్ధ ఫలితాన్ని క్షణంలో మార్చగల మహాయోధుడైన బర్బరీకుడు యుద్ధానికి వస్తున్నాడన్న విషయం తెలిసిన కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషంలో అతడికి ఎదురు వెళ్లి "మూడు బాణాలతో యుద్ధానికి వస్తున్నావే?" అంటూ ఎగతాళిగా అడిగాడు. "ఇవి చాలా మహిమాన్వితమైనవి" అంటూ వాటి శక్తిని కృష్ణునికి వివరిస్తాడు. కృష్ణుడు ఆ బాణాల శక్తిని పరీక్షించదలచి ఎదురుగా వున్న రావిచెట్టు ఆకులన్నిటిని గుది గుచ్చమంటాడు. బర్బరీకుడు మొదటి బాణాన్ని వదిలేలోగా కృష్ణుడు ఒక ఆకును తన కాలి క్రింద దాస్తాడు. బర్బరీకుడు వదలిన బాణం చెట్టు ఆకులనన్నిటినీ రంద్రం చేసి వచ్చి కృష్ణుని కాలిని క్షేదించి ఆ ఆకును కూడా రంద్రం చేస్తుంది.
అమోఘమైన అతని బాణాల శక్తి చూసిన కృష్ణుడు "యుద్ధంలో ఎవరి పక్షం వహిస్తావు"? అని అడిగాడు. డానికి బర్బరీకుడు "ముందు నేను యుద్ధాన్ని గమనిస్తాను. అనంతరం బలహీన పక్షం వహిస్తాను" అన్నాడు.
"నీవు ఏ పక్షంలో చేరతావో అవతలి పక్షం బలహీన మవుతుంది. అప్పుడు నీవు మళ్ళీ పక్షం మారాల్సి వుంటుంది. నీవు అవతలికి వెళ్ళగానే ఇవతలి పక్షం బలహీన మవుతుంది. ఇలా నీవు అటూ ఇటూ తిరుగుతూ వుండడం వలన పర్యవసానం ఏమౌతుందో ఆలోచించావా?" అన్నాడు కృష్ణుడు.
బర్బరీకుడు సందిగ్దంగా ఆలోచనలో పడ్డాడు. కృష్ణుడు చాలా యుక్తిగా అతన్ని మాటల్లో పెట్టి తాను ఏదడిగినా ఇచ్చేటట్లు మాట తీసుకుని, కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఒక మహాయోధుని శిరస్సును బలిగా ఇవ్వవలసి వుంది కాబట్టి అందుకు ఒప్పుకో మంటాడు. బర్బరీకుడు బ్రాహ్మణ వేషంలో వున్నది కృష్ణుడే అని తెలుసుకుని తన శిరస్సు తెగిపడినా తనకు మహాభారత యుద్ధం అంతా చూసే భాగ్యం కలుగ జేయమంటాడు. కృష్ణుడు అతని శిరస్సును ఒక ఎత్తైన పర్వతం మీద వుంచి దానికి యుద్ధం మొత్తం చూసే శక్తిని ప్రసాదిస్తాడు. పాండవులు "ఇదేమిటి?" అని అడిగితే, కృష్ణుడు "బర్బరీకుడు పూర్వ జన్మలో ఒక యక్షుడు. బ్రహ్మ శాప వశాన ఇలా రాక్షస జన్మ ఎత్తాడు. ఇప్పుడు శాప విమోచన జరిగింది" అని వివరించాడు.
ఏది ఏమైనా బర్బరీకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి శిరస్సును అర్పించి
మహాభారత యుద్ధానికి బలిదానం చేసి
అసాధారణ త్యాగమూర్తిగా నిలిచిపోయాడు. - దాసరి వెంకట రమణ
(ఈ కథకు బొమ్మను వేసినది శ్రీ "సునీతా వాసు")