Monday, 12 September 2016

PUT CHECK 2 CANCER WITH ZINGER AND MIRCHI - ALLAM AND MIRAPAYAKALU


అల్లం, మిర్చి కలిస్తే.. క్యాన్సర్‌కు చెక్‌!

ఘాటైన రుచులకు మీరు అభిమానులా? అయితే మీకో శుభవార్త. అల్లం, ఎండు మిర్చి కలిసిన ఆహారం తీసుకుంటే క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుందని తాజాగా వెలుగులోకి వచ్చింది. మిర్చిలోని కెప్సాయ్‌సిన్‌ సమ్మేళనాలతో జీర్ణాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముందని ఇదివరకటి పరిశోధనల్లో తేలింది. అయితే కెప్సాయ్‌సిన్‌ దుష్ప్రభావాలను అల్లంలో ఘాటును పెంచే జింజెరోల్‌-6 తగ్గించగలదని తాజాగా బయటపడింది. అంతేకాదు కెప్సాసిన్‌, జింజెరోల్‌ కలిస్తే.. క్యాన్సర్‌ కణితుల పెరుగుదలను నియంత్రిస్తాయని వెలుగులోకి వచ్చింది. ఎలుకలపై అమెరికన్‌ సొసైటీ వైద్యులు తాజా పరిశోధన నిర్వహించారు. జన్యు మార్పుల ద్వారా మొదటగా వాటిలో వూపిరితిత్తుల క్యాన్సర్‌ లక్షణాలను ప్రేరేపించారు. అనంతరం వాటిలో కొన్నింటిపై కెప్సాయ్‌సిన్‌, జింజెరోల్‌లను విడివిడిగా, మరికొన్నింటిపై రెండూ కలిపి ప్రయోగించారు. రెండూ కలిపి ప్రయోగించిన ఎలుకల్లో 80 శాతం వరకూ కణితుల పెరుగుదల నియంత్రణలోకి వచ్చినట్లు గుర్తించామని పరిశోధకులు లీ జియాహువాన్‌ వివరించారు. రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిల నియంత్రణలోనూ అల్లం, మిర్చి కీలక పాత్ర పోషించే సంగతి తెలిసిందే.